Friday, 11 January 2019

ELIJAH- ELISHA (ఏలీయా-ఎలీషా )

చాలా సంవత్యరాలు గడిచిపోయాయి, రాను రాను ఏలీయా ముసలివాడైపోతున్నాడు. తాను చనిపోయాక తన స్థానంలో మరొక దేవునికి ప్రవక్తగా ఉండవలసిన వ్యక్తికోసం వెతకడానికి ఏలీయా తొందరపడుతున్నాడు. ఒక రోజు దేవుడు ఏలీయాని ఎలీషా అనే అతని వద్దకు నడిపించాడు. ఏలీయా మాదిరిగానే ఎలీషా కుడా దేవుని ప్రేమించి, ఆయన చెప్పేది విని లోబడేవాడు. ఏలీయాకు సహాయం చెయ్యడానికి తాను దేవునిచేత ఏర్పరచబడినట్లు ఎలీషా తెలుసుకున్నాడు. గనుక వాళ్లిద్దరూ మంచి మిత్రులయ్యారు. తాను కలిసిన వాళ్లందరిలో ఏలీయానే చాలా ఉత్తముడని ఎలీషా అనుకున్నాడు. 

 ఒక రోజు ఏలీయా ఎలీషాను తీసుకుని చాలాదూరం నడుచుకుంటూ వెళ్ళాడు. తానీ లోకం విడిచి వెళ్లాల్సిన రోజు వచ్చిందని ఏలీయాకు తెలుసు. ఏలీయాను పరలోకం తీసుకువెళ్లడానికి దేవుడు చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. ఈ సంగతి తెలిసినప్పుడు ఎలీషా చాలా దుఃఖించాడు. ఏలీయా ఎక్కడికి వెళితే అక్కడికి ఆయననే అనుసరించాలనుకున్నాడు ఎలీషా. కాబట్టి వాళ్లిద్దరూ అలా చాలాదూరం వరకు నడుచుకుంటూ వెళుతూనే ఉన్నారు. వారు యోర్దను నదికి చేరుకున్నప్పుడు,ఏలీయా తన దుప్పిటి తీసుకుని దానితో నీళ్లను కొట్టాడు. హఠాత్తుగా, ఆ నదిలో ఉన్న నీళ్లు వెనక్కి వెళ్లిపోయాయి, గనుక ఏలీయా, ఎలీషా ఆరిన నేల మీద ఆ నదిని దాటారు.                                                                                    
                                                                                                                                   2 రాజులు 2
-నవీన్ కుమార్ యెలుమర్తి -

Wednesday, 21 November 2018

FIRE FROM THE SKY (ఆకాశం నుంచి అగ్ని)

ఇప్పుడు ఏలీయా వంతు వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే, కడవలతో నీళ్లు తెచ్చి బలిపీఠం మీద అంతటా పోయామని ఏలీయా ఆజ్ఞాపించాడు. దానిమీద  నుంచి ఒలికిపోయిన నీళ్లు బయటికి పోకుండా బలిపీఠం చుట్టూ ఒక కాలువ కూడా త్రవ్వించాడు. 
   ఏలీయా తన చేతులు పైకెత్తి, నెమ్మదిగా దేవునికి ప్రార్ధన చేయడం అందరూ ఆశక్తిగా గమనించారు. "దేవా, నీవొక్కడివే ఏకైక నిజ దేవుడని ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికీ చూపుము . ఇశ్రాయేలులో నీవే దేవుడవని, నేను నీ సేవకుడనని, నీ ఆజ్ఞ ప్రకారమే ఇదంతా జరిగించానని అందరికి తెలియనిమ్ము" అని వేడుకున్నాడు. 

    అతడు ప్రార్ధించిన తర్వాత ఆకాశం నుండి ఒక పెద్ద మంట దిగివచ్చి బలిపీఠాన్ని ధడేలుమని శబ్ధంతో తాకింది. ఆకాశం నుండి వచ్చిన మంటలు బలిపీఠం మీద ఉన్న వాటన్నిటినీ కాల్చివేశాయి. బలిపీఠం కోసం వాడిన పెద్ద రాళ్లు కుడా కాలిపోవడం మొదలయింది, చుట్టూ ఉన్నా నీళ్లు మాయమైపోయాయి. వాళ్ళ కళ్ళముందు జరిగింది చూచిన ప్రతివారూ నమ్మలేకపోయారు, అందరూ మోకాళ్ళమీద పడి "యెహోవాయే నిజమైన దేవుడు!" అంటూ కేకలు వేశారు. 
                                                                                         అగ్ని                                          1రాజులు 18
     - నవీన్ కుమార్ యెలుమర్తి -

Friday, 2 November 2018

LARGE TEST (పెద్ద పరీక్ష)

మూడేళ్లు గడిచిపోయాయి కానీ, రాజైన అహాబు మాత్రం దేవుని వెంబడించని మొండివాడిగా, దుర్మార్గుడుగానే కొనసాగాడు. దేవుని వైపు తిరగడానికి బదులు అతడు బయలు దేవతకు, మరిన్ని విగ్రహాలు కట్టించాడు. మరొకసారి దేవుడు  ఏలీయాను రాజుగారి దగ్గరకు పంపి "నీవు ఇంకా బయలు దేవతనే  ఎందుకు పూజిస్తున్నావు?జీవము గల నిజ  దేవునికి, అసలు దేవుడే కాని ఆ బయలు దేవతకు మధ్య మనం పోటీ పెట్టుకుందాం రా. దీనితో ఏ దేవుడు నిజమైనవాడో శాశ్వతంగా తేలిపోతుంది" అని చెప్పమన్నాడు. 
     రాజైన అహాబు ఈ పోటీకి సమ్మతించి, ఇశ్రాయేలు నాయకుల నందరినీ ఒక పెద్ద పర్వతం మీదికి రమ్మని చెప్పాడు. రాజు ఇప్పుడు బయలు దేవతను నమ్ముతున్న వందలాది యాజకులను కూడా తెచ్చాడు. వాళ్ళు రెండు బలిపీఠాలను కట్టారు ఒకటి దేవునికి, మరొకటి బయలుకు ఆ బలిపీఠాల మీద వాళ్ళు కట్టెలు కుడా పేర్చారు. 
       ఏలీయా ఆ కట్టెలు తీసుకొని, "కట్టెలకు నిప్పు అంటించకండి. మీ దేవుడైన బయలుకు ప్రార్ధనచెయ్యండి. అతడు నిజంగా దేవుడైతే, బలిపీఠం మీద ఉన్న కట్టెలు మండేలా చేస్తాడు. తర్వాత నేను జీవముగల దేవునికి ప్రార్ధన చేస్తాను. ఇప్పుడు మనం ఒక అంగీకారానికి వద్దాం. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడో అతడే నిజమైన దేవుడని ఈ రోజునుంచి మనం నమ్ముదాం" అని చెప్పాడు. 
       బలిపీఠం మీద అగ్ని పుట్టించమని వందలాది యాజకులు బయలు దేవతను బ్రతిమాలుకున్నారు. కానీ ఏమి జరగలేదు.  ఏలీయా వాళ్ళని రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు. "పెద్దగా కేకలు వేయండి!" అతడు నిజంగా దేవుడే! బహుశా దీర్ఘాలోచనలో ఉన్నాడో,లేదా ప్రయాణంలో ఉన్నాడేమో బహుశా నిద్రపోతున్నాడేమో లేపండి" అన్నాడు అయినా సరే ఏమి జరగలేదు. బయలు దేవుడు కాదు, కేవలం ఓ రాయి, కొయ్య ముక్క, మనుషుల ఉహల్లో నుంచి పుట్టినవాడు మాత్రమే . 
                                                                                                                                                                                                                        1రాజులు 18 
    -నవీన్ కుమార్ యెలుమర్తి -



Thursday, 1 November 2018

ELIJAH BORN WITH BIRDS (ఏలీయా:పక్షులతో పోషించబడ్డాడు )

సొలొమోను రాజు, తర్వాత దేవుని గురించి అస్సలు పట్టించుకోని చాలా మంది చెడ్డరాజులు వచ్చారు. పైగా వారు రాళ్లతో,కొయ్యతో చేసిన అనేక రకాల విగ్రహాలను కట్టించారు. వారితో అత్యంత దారుణమైన రాజు అహాబు.  తన రాజ్జములో ప్రజలంతా బయలు అనే దేవతను పూజించాలని తీర్మానం చేశాడు. దాదాపు అందరూ రాజుగారి ఆజ్ఞకు లోబడ్డారు, ఎందుకంటే ఎవడైతే దేవుని పూజించడం విడిచిపెట్టడో వానిని చంపేస్తానని ప్రకటించాడు రాజు. 


           అయితే ఇశ్రాయేలు దేశంలో నిజమైన దేవునియందు నమ్మకం ఉంచినవారు ఏడువేలమంది ఉన్నారు, వారిలో ఏలీయా ఒకడు. అహాబు దగ్గరకు వెళ్లి మీరు దేవునికి లోబడి, బయలు దేవతను పూజించడం ఆపెయ్యాలని చెప్పమని దేవుడు ఏలీయాకు చెప్పాడు. అయితే అహాబు ఏలీయా మాట వినడానికి ఇష్టపడలేదు గనుక దేవునికి చాలా కోపం వచ్చింది. అందువల్ల ఇశ్రాయేలు మీద చాలాకాలం వరకు వర్షం కురవకుండ ఆపి, దేవుడు అహాబు రాజుని, ఇశ్రాయేలు దేశాన్ని శిక్షించాడు. తినడానికి ఏదైనా దొరకడం చాలాకష్టమైంది. రాజైన అహాబు ఏలీయాను చంపాలనుకున్నాడు. ఎందుకంటే అతడు దేవుని ప్రవక్త. అయితే ఏలీయా  అహాబు  ప్రవక్త అయితే ఏలీయా, అహాబు,రాజుకు దూరంగా చాలా క్షేమముగా ఉన్నాడు. అతడొక నిర్మానుషమైన ప్రాంతంలో దాక్కున్నాడు.  అక్కడ మనుషులెవరూ లేరు . 
     అనేక నెలలుగా  వర్షం లేకపోవడం వల్ల ఆ దేశం అంతా ఎండిపోయింది, కానీ ఏలీయా మాత్రం చక్కగా  ప్రవహించే ఒక  సెలయేరు ప్రక్కన క్షేమంగా ఉన్నాడు. ప్రతి రోజు ఉదయాన్నే పెద్ద పెద్ద పక్షులు ఏలీయాకు రొట్టె ముక్కలు, మాంసం తీసుకొస్తాయి గనుక తినడానికి సరిపోయినంత ఆహారం వుంది ఈ విధంగా అతడు దుర్మార్గుడైన రాజు సైనికుల కంట బడకుండా దాగియున్నంత కాలం దేవుడు తాను పంపిన పక్షులు సహాయంతో ఏలీయాను పోషించాడు. 
                                                                                                                                             1రాజులు 17
       -నవీన్ కుమార్ యెలుమర్తి -

Tuesday, 30 October 2018

SALMON - WISE KING (సొలొమోను : జ్ఞానియైన రాజు )

సౌలు చనిపోయినప్పుడు ప్రజలు దావీదును తమ కొత్త రాజుగా ఎన్నుకొన్నారు. దావీదు మహారాజు గొప్ప రజ్జాన్ని కట్టుకుని, ఇశ్రాయేలువారి అనేక శత్రువులను ఓడించాడు. అతడు యెరూషలేమును కూడా వశపరుచుకొని ఆ నగరంలో తన పెద్ద రాజభవనాన్ని కట్టించాడు. దావీదు దేవుని వెంబడించి ఆయన మాటకు లోబడినాడు గనుక మంచి  అయ్యాడు. దావీదుకు అనేక విషయాల్లో నైపుణ్యం ఉంది. అతడు గొప్ప యోధుడే గాక చక్కని సంగీత విధ్వంసుడు, అద్భుతమైన కవి కూడాను. దావీదు సితార వాయించి, దేవుని ప్రేమ గురించి, మన జీవితాలలో ఎదురయ్యే కష్టాలలో దేవుని నమ్మడం గురించి చాలా పాటలు రాశాడు. 
    దావీదు కుమారుడైన సొలొమోను దావీదు తర్వాత రాజయ్యాడు. మంచి రాజుగా జ్ఞానంతో పరిపాలించడం కోసం తనకు జ్ఞానం ఇవ్వమని దేవునికి ప్రార్ధన చేశాడు గనుక సొలొమోను చాలా జ్ఞానియైన రాజు అయ్యాడు. సొలొమోను ఎంతో జ్ఞానము గలవాడంటే అనేక ఇతరదేశ ప్రజలు కూడా అతని జ్ఞానం కోసం విని, అతన్ని కలవడానికి, అతని జ్ఞానవాక్కులు వినడానికి ఎంతో దూరప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు. 
        దేవుడు సొలొమోనుని గొప్ప ధనవంతుడిగా కుడా చేశాడు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరికంటే ఎక్కువ సంపద అతనికున్నది. అయితే సొలొమోను తమ సంపాదనంతా అతని కోసమే ఖర్చుపెట్టుకోలేదు యెరూషలేములో మొట్టమొదటి దేవాలయాన్ని కట్టడానికి కుడా ఆ సంపదను ఉపయోగించాడు. ఇది యెరూషలేములో ప్రత్యేకమైన దేవాలయం, దానిని కట్టడానికి చాల ఖర్చయింది. అందులో ఉన్నదంతా బంగారం,వెండి, దగదగ మెరిసే ముత్యాలతో పోతపోశారు. అందులో ఉండే వస్తువులన్నీ కూడా బంగారంతో చేసినవే. దేవాలయ నిర్మాణం ముగిశాక, సొలొమోను దానిని అధికారికంగా ఆరంభించినప్పుడు ఏడు రోజుల పాటు పెద్ద విందు జరిగింది.                                                                                                                 
                                                                                                                                         1రాజులు 2-10
                     -నవీన్ కుమార్ యెలుమర్తి-

Monday, 29 October 2018

SAUL- DAVID (సౌలు - దావీదు)

కొన్నేళ్ల తరువాత దావీదు యువకుడయ్యాక, సైన్యంలో నాయకుడయ్యాడు. అతడు చాలా యుద్ధాలు గెలిచాడు గనుక ప్రజలు "దావీదు సౌలుకంటే గొప్ప వీరుడు" అని పొగిడారు, ఈ మాటలు సౌలుకు ఎంతో అసూయ కలిగించాయి. అతడు రహస్యంగా దావీదును చంపడానికి మార్గాలు వెతుకుతున్నాడు. ఒక రోజు, వాళ్లిద్దరూ కలిసి భోజనం చేశాక, సౌలు తన ఈటెను దావీదు మీదికి విసిరాడు. 
   ఈటె దెబ్బ తప్పించుకున్న దావీదు పారిపోయి సౌలుకు కనబడకుండ దాక్కున్నాడు. దావీదు కొండల్లోకి పారిపోయాడు గాని సౌలు తన సేనలతో అతన్ని వెంటాడాడు. ఎలాగైనా దావీదును కనిపెట్టి చంపాలనుకున్నాడు. 
  ఒకరోజు సౌలు మనుషులు ఒక కొండ వద్దకు వచ్చారు అయితే దావీదు అతని జనులు అప్పటికే ఆ కొండా లోపల ఉన్న ఒక గుహలో దాక్కొని ఉన్నారు. సౌలు, అతని సైన్యం కూడా అదే గుహ ద్వారం దగ్గర ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు బాగా నిద్రలో ఉన్నప్పుడు దావీదు,అతని మనుషులు గుహ లోపలినుంచి నెమ్మదిగా వాళ్ళను సమీపించారు. 
    సౌలు తన ఈటెను ప్రక్కనే పెట్టుకొని నేల మీద పడుకొని, గాఢనిద్రలోకి జారుకున్నాడు. దావీదు మనుషులున్నారు, "చూడు! సౌలును చంపి రాజ్జాన్ని చేజిక్కించుకోవడానికి నీకిదే మంచి అవకాశం." అయితే దావీదు సౌలును చంపాలనుకోలేదు గనుక "అనేక సంవత్యరాల క్రితం దేవుడే సౌలును రాజుగా చేశాడు. కాబట్టి నేను అతన్ని చంపడం అంత మంచి పని కాదు" అన్నాడు. అయితే దావీదు సౌలు వేసుకున్న అంగిలో ఒక ముక్కను కత్తిరించి, మెల్లగా ఎవరికీ మెలుకువ రాకుండ వెళ్ళిపోయాడు. 
   ఆ తెల్లారి ఉదయాన్నే, ఒక కొండపైన నిలబడి సౌలును కేకవేసి పిలిచాడు. అతడు కత్తిరించిన సౌలు అంగిలోని ఆ ముక్కను పైకెత్తి పట్టుకొని, "కావాలనుకుంటే నిన్న రాత్రి నేను నిన్ను చంపివుండేవాడిని. కానీ నీకు ఎలాంటి హాని చెయ్యలేదు, నీవు నాగురించి భయపడవాల్సిందేమి లేదు. మరి నువ్వెందుకు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు?" అని అడిగాడు అప్పుడు సౌలు "నీవు చెప్పింది నిజమే దావీదూ. నీవు నాపట్ల దయచూపి, నా ప్రాణం తీయకుండ వదిలేశావు" అన్నాడు. అంతటితో సౌలు తన హృదయంలో దావీదును ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాడు.  
                                                                                      1సమూయేలు 18-24
-నవీన్ కుమార్ యెలుమర్తి -

Friday, 19 October 2018

DAVID & GOLIATH (దావీదు-గొల్యాతు )

ఒక రోజు దావీదు అనే కుర్రాడు సైన్యంలో పని చేస్తున్న తన అన్నలను చూడడానికి యుద్ధ శిబిరానికి వచ్చాడు. దావీదు గొర్రెలు  కాచేవాడు. ఇశ్రాయేలు దేశంలో ఆ రోజుల్లో చిన్నవాళ్లు ఇంటిలో సహాయం చేయడం, గొర్రెలు కాయడం మాములే. దావీదు గొల్యాతును చూడగలిగాడు, అందరూ అతనికి ఎలా భయపడుతున్నారో కూడా చుశాడు. అయితే దావీదుకు భయంలేదు. 

        దావీదు నేరుగా సౌలు రాజు వద్దకు వెళ్లి, "నేను గొల్యాతుకు భయపడటంలేదు, అతనితో పోరాడతాను" అని చెప్పాడు. అందుకు సౌలు "నువ్వు చిన్న పిల్లవాడివి కదా, అంత గొప్ప బలాఢ్యుడితో పోరాడి అతన్ని ఎలా ఓడించగలవు?అన్నాడు. "నా గొర్రెలను దొంగిలించడానికి ప్రయత్నించిన సింహాలను, ఎలుగుబంటిలను సైతం దేవుని సహాయంతో నేను చంపాను. గొల్యాతుతో పోరాడానికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు" అని దావీదు బదులిచ్చాడు. 

  సౌలు ఈ ధైర్యవంతమైన మాటలు వినేసరికి, అతడు తన సొంత ఖడ్గాన్ని,శిరస్త్రాణాన్ని,కవచాన్ని దావీదుకి ఇచ్చాడు. అయితే ఆ శిరస్త్రాణము, కవచమూ చిన్నవాడైన దావీదుకు బరువుగా అనిపించాయి. గనుక వాటిని సౌలుకు తిరిగి ఇచ్చేశాడు. 
     వాటికి బదులు దావీదు ఐదు నున్నటి రాళ్లు ఏరుకున్నాడు. ఒక రాయిని తన ఒడిసెలలో పెట్టుకుని,గొల్యాతుతో పోరాడటానికి వెళ్ళాడు. దావీదు గొల్యాతును చూచి, "నాతో నీవు నీ ఖడ్గంతో,ఈటెతో నీకున్న బలమంతటితో పోరాడుతున్నావు. అయితే నేను దేవుడు నాకిచ్చే బలంతో పోరాడుతున్నాను"అని కేకలు వేశాడు. అప్పుడు దావీదు తన చేతిలో ఉన్న ఒడిసెలను గుండ్రంగా తిప్పుతూ తిప్పుతూ గొల్యాతు వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 
     ఆ తర్వాత అతడు రాయి విసరగానే అది వెళ్లి గొల్యాతు రెండు కళ్ళకు పైన సరిగ్గా నుదిటిమీద తగిలింది. ఆ రాక్షసుడు నేలమీద బోర్లా పడిపోయాడు. దావీదు పరిగెత్తుకుంటూ అతని వద్దకు వెళ్లి గొల్యాతు సొంత కత్తిని లాక్కుని అతని తల తెగనరికాడు. గొల్యాతు ఓడిపోయాడు. శూరుడైన గొల్యాతు ఒక చిన్న పిల్లవాడి చేతిలో ఓడిపోవడం చూచి ఖంగుతిన్న ఫిలిష్తీయులు అక్కడ నుండి పారిపోయారు. అయితే ఇశ్రాయేలు సేనలో ఉన్న సైనికులంతా ఒక్కసారిగా ఉత్సాహం తెచ్చుకొని, దేవుని సహాయంతో దావీదు గొల్యాతును ఓడించిన సందర్భాన్ని పండుగచేసుకున్నారు. దావీదు ఇశ్రాయేలులో ఒక గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. 
             
                                                                                                                             1సమూయేలు 17
 -నవీన్ కుమార్ యెలుమర్తి -